India US-Trade Tensions: భారత్-అమెరికా వ్యాపార సంబంధాల్లో ఉద్రిక్తత!

India US-Trade Tensions: భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకోవడంతో, అమెరికా భారత్‌పై సుంకాలు విధించింది. ఈ పరిణామంతో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా, అమెరికా-భారత్‌ వాణిజ్య సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలను అన్వేషిస్తూ, కొత్త దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో ఇండియా-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్‌ను మిత్రుడిగా చూడాలని అమెరికా మాజీ రాయబారి వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా వైఖరి "చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది" అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

India US-Trade Tensions

ఇండియాపైనే ఆంక్షలు?: చైనా కూడా రష్యా నుంచి విస్తృతంగా చమురు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, దానిపై అమెరికా ఎటువంటి ఒత్తిడి చూపకపోవడం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోంది. ఈ ద్వంద్వ విధానం భారత్-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే విమర్శలు ఉన్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత్-చైనా దగ్గరైతే అది అమెరికాకు గణనీయమైన ముప్పు కావచ్చు. భారత్, చైనా మధ్య ఉన్న విభేదాలనే అమెరికా ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని వారు పేర్కొంటున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో, చైనా మాజీ రాయబారి చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


భారత్‌ను భాగస్వామిగా చూడాలి: భారత్‌తో తగాదాలు అమెరికాకే నష్టాన్ని కలిగిస్తాయని, అది వ్యూహాత్మక పరాజయమవుతుందని అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ హెచ్చరించారు. చైనాను నియంత్రించాలనుకుంటే, అమెరికా భారతదేశాన్ని ప్రత్యర్థిగా కాకుండా ‘స్వేచ్ఛాయుత భాగస్వామి’గా చూడాలని ఆమె సూచించారు. గతంలో భారత్‌ను "డెడ్ ఎకానమీ"గా అభివర్ణించడం తప్పని గుర్తు చేశారు. వాస్తవానికి, భారత్‌ స్థిరపడుతున్న మార్కెట్, వేగంగా పెరుగుతున్న వృద్ధిరేటు, ప్రపంచ వ్యాపారంలో ఉన్న అవకాశాలు - ఇవన్నీ కలిపి దానిని ఒక ప్రధాన శక్తిగా నిలబెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

భారత్‌ పెరుగుతున్న ప్రాధాన్యం: ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ముందంజలో ఉంది. తక్కువ ఖర్చుతో వస్త్రాలు, మొబైల్‌ ఫోన్లు, సౌర ప్యానెల్లు వంటి తయారీలో చైనాకు బలమైన ప్రత్యామ్నాయం ఇవ్వగల సామర్థ్యం భారత్‌ వద్ద ఉంది. అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్‌ వంటి దేశాలతో భారత సైనిక సహకారం బలపడుతోంది. మధ్యప్రాచ్యంలో ఆదరణ పెరుగుతున్నది. అంతేకాక, ప్రపంచ జనాభాలో అగ్రస్థానం కలిగిన భారత్‌ ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉంది.

అమెరికా తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించాలంటే భారతదేశాన్ని కోల్పోలేని మిత్రుడిగా పరిగణించాలి. వాణిజ్య విభేదాలు ఎంతున్నా, భవిష్యత్తు శక్తి సమీకరణల్లో భారత్‌ కీలక పాత్ర పోషించనుంది.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post