Chevella Bus Accident: చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం.. కర్నూల్ విషాదం మరువకముందే మరో దారుణం!

Chevella Bus Accident: తెలంగాణలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కర్నూల్ బస్సు ప్రమాదం మరువకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపైకి మృత్యుశకటంలా దూసుకొచ్చింది టిప్పర్ లారీ. ఏం జరుగుతుందో తెలియక ముందే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిశాయి. అతివేగమే ఈ విషాదానికి ప్రధాన కారణమైంది.

Chevella Bus Accident
Chevella Bus Accident

ప్రాణాలను బలి తీసుకున్న కంకర మరియు మలుపు: టిప్పర్ లారీలో ఉన్న కంకర బస్సును ఢీకొట్టడంతో, ఒక్కసారిగా ఆ కంకర బస్సు ప్రయాణికుల మీదపడ్డాయి. దాంతో పది మందికిపైగా ప్రయాణికులు కంకర కిందే పాతుకుపోయారు. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది మృతి చెందారు. మృతుల్లో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు బస్సు మరియు టిప్పర్ డ్రైవర్లు ఉన్నారు.

మృతులలో ఏడాది పాపతో పాటు 11 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. అదనంగా 24 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఘటన స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి: ఈ ప్రమాదం హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన బస్సు ఈ ప్రమాదంలో దెబ్బతింది. ప్రమాదం కారణంగా చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గాయపడిన వారిని తక్షణమే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో జేసీబీ సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. అధికారులు తెలిపిన ప్రకారం, ప్రమాద స్థలం వద్ద ప్రమాదకర మలుపు ఉండటం వల్లే ఈ దారుణం జరిగింది. టిప్పర్ ఓవర్ స్పీడ్‌లో బస్సును ఎదురెదురుగా ఢీకొట్టిందని ప్రాథమిక విచారణలో తేలింది.

సీఎం రేవంత్‌ రియాక్షన్ - వెంటనే సహాయక చర్యలకు ఆదేశాలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి వెళ్లాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గాయపడిన వారందరినీ హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాల‌ని సీఎస్‌, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనాస్థలికి చేరుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందన: ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అధికారులు మాట్లాడినప్పుడు, తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టిందని సమాచారం అందించారు.

స్పీకర్ ప్రసాద్ కుమార్ క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు.


Post a Comment (0)
Previous Post Next Post